కరకట్టపై ఇళ్లను ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు .. చంద్రబాబు ఇంటికి నోటీసు!

మంగళవారం, 13 అక్టోబరు 2020 (17:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. దీంతో కృష్ణా నది కరకట్టపై ఉండే నివాసాలకు అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కూడా నోటీసులు పంపారు. చంద్రబాబుతో పాటు మరో 36 ఇళ్లకు నోటీసులు జారీ చేశారు.
 
భారీ వరద నేపథ్యంలో కరకట్ట వద్ద ఉన్న నివాసాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో అధికారులు కోరారు. ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. కరకట్ట ప్రాంతంలోని నివాసాల్లోకి ఏ సమయంలోనైనా వరదనీరు చేరవచ్చని అధికారులు హెచ్చరించారు. 
 
మరోవైపు, ఏపీని వణికిస్తూ వచ్చిన తుఫాను మంగళవారం ఉదయం తీరం దాటింది. విశాఖపట్టణం, నర్సాపూర్ మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొచ్చిన వాయుగుండం కాకినాడ సమీపంలో భూభాగాన్ని తాకినట్టు అధికారులు తెలిపారు. తీరం దాటిన అనంతరం ఇది తొలుత వాయుగుండంగా, ఆ తర్వాత అల్పపీడనంగా మారుతుందని పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
 
వాయుగుండం ప్రభావంతో కోస్తా, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు