మంటల్లో కాలిపోయిన ఆర్టీసీ బస్సు.. 50 మంది ప్రయాణికుల సురక్షితం

బుధవారం, 7 సెప్టెంబరు 2022 (09:51 IST)
విశాఖపట్టణంలో ఓ ఆర్టీసీ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఇందులో ప్రయాణిస్తూ వచ్చిన దాదాపు 50 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదం విశాఖ జిల్లా పరవాడ మండలం, వాడచీపురుపల్లికి సమీపంలోని జ్ఞానాపురం వంతెన వద్ద జరిగింది. 
 
వాడచీపురుపల్లి నుంచి 50 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బయలుదేరింది. జ్ఞానాపురం కాన్వెంట్ కూడలి వంతెనపైకి రాగానే బస్సు వెనుక చక్రం నుంచి పొగలు వచ్చాయి. 
 
దీన్ని గమనించిన బస్సు కండక్టర్ ఈ విషయాన్ని డ్రైవర్‌కు చేరవేశాడు. వెంటనే బస్సును ఆపేసి, అందులోని ప్రయాణికులందరినీ కిందకు దించేశాడు. ఆ తర్వాత పోలీసులకు, అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం చేరవేశాడు. 
 
అయితే, బస్సులో నుంచి ప్రయాణికులు దిగిన కొన్ని క్షణాల్లోనే మంటలు బస్సును చుట్టుముట్టాయి. ఆ సమయంలో అటుగా గ్యాస్ సిలిండర్ల లారీ రావడంతో అక్కడే ఉన్న హోం గార్డులు ఆ లారీని దూరంగా నిలిపివేశారు. 
 
ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే బస్సుకు నలువైపులా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే, ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు