విద్యార్థులకు డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ

బుధవారం, 7 అక్టోబరు 2020 (07:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్ఎల్ఆర్ ముందుకు వచ్చింది.

ఈమేరకు ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ సమక్షంలో ఎపిఎస్‌ఎస్‌డిసి సీజీఎం టెక్నికల్ డాక్టర్ గుజ్జుల రవి, ఎక్స్ఎల్ఆర్ సంస్థ సీఈవో రామ్ తవ్వ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. 

ఈ ఒప్పందం ప్రకారం ఎక్స్ఎల్ఆర్ సంస్థ డేటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బిగ్ డేటా లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి మరియు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులతోపాటు అధ్యాపకులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు.

రాబోయే రోజుల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్న మరిన్ని కోర్సుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డి.వి. రామకోటిరెడ్డి అన్నారు.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఎపిఎస్‌ఎస్‌డిసితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఎక్స్ఎల్ఆర్ సంస్థ సీఈవో రామ్ తవ్వ అన్నారు. 

ఇప్పటికే ఎపిఎస్‌ఎస్‌డిసి - ఎక్స్ఎల్ఆర్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లోని 2500 మంది అధ్యాపకులకు డేటా సైన్స్ పై నెలరోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది.

అంతేకాకుండా ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి మరియు ఇంజనీరింగ్ (ఇసిఇ, సిఎస్ఇ / ఐటి) &ఎంటెక్ (ఇసిఇ, సిఎస్ఇ /ఐటి) చివరి సంవత్సరం చదువుతున్న 3,272 మంది విద్యార్థులకు 40రోజల పాటు డేటా అనలిటిక్స్ పై ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు