విజయవాడలోని రెండు బైపాస్ ప్రాజెక్ట్ లపై పార్లమెంటులో వివ‌ర‌ణ‌

శుక్రవారం, 3 డిశెంబరు 2021 (17:47 IST)
కృష్ణా జిల్లా మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఈ రోజు పార్లమెంట్ సమావేశంలో విజ‌య‌వాడ బైపాస్ రోడ్ల పురోగ‌తిపై కేంద్ర హైవేస్ మంత్రిని ప్రశ్నించారు. 

 
విజయవాడలో రెండు బైపాస్ లు ఒకటి 30 కిలో మీటర్లు, మ‌రొకటి 17 కిలో మీటర్లు పొడవుతో, ఒకటి 997 కోట్లు, మరొకటి 1194 కోట్ల అంచనా వ్యయంతో మంజూర‌యి ప్రాజెక్ట్ ల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
 
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో రెండు బైపాస్ రోడ్డులు ఎపుడో మంజూర‌య్యాయి. మొదటి బైపాస్ చినఅవుటపల్లి నుండి గొల్లపూడి ( ప్యాకేజి -3) వరకు 6 వరసల రహదారి 30 కి.మీ. పొడవుతో 1148.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి బిడ్ ను అంగీకరించారు. ఈ ప్రాజెక్ట్ పనిని  కాంట్రాక్టర్ మేఘా ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్ గ‌త ఫిబ్ర‌వ‌రి 18న పనులు ప్రారంభించింది.  ఇప్పటివరకు 23 శాతం పనులు పూర్త‌య్యాయి. కోవిడ్ -2 వేవ్ కారణంగా కాంట్రాక్టర్ సకాలంలో పనులను పూర్తి చేయలేక పోయారు. మొదటి దశ పనులను 17.07.2021 నాటికీ పూర్తి చేయవలసి ఉండగా, కరోనా కారణంగా పనులు సక్రమంగా జరగని పరిస్థితులలో ఈ తేదీని 13.10.2021 వరకు పొడిగించారు. ఈ ప్రాజెక్ట్ పని 17.02.2023 లోగా పూర్తీ చేయాలని తాజా గడువు విధించారు. 
 
 
ఇక విజయవాడ న‌గ‌రానికి రెండవ  బైపాస్  గొల్లపూడి నుంచి చినకాకాని వరకు (ప్యాకేజి -4) ఆరు వరసల రహదారి 17.66  కి.మీ. పొడవుతో 1,546.31 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బిడ్ ను అంగీకరించారు.  ఈ ప్రాజెక్ట్ పనిని  కాంట్రాక్టర్ విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ జులై 7, 2021న పనులు  ప్రారంభించింది. ఇప్పటివరకు కేవలం 3.36 శాతం పనులు మాత్రమే పూర్త‌య్యాయి.


గత రెండు, మూడు నెలలుగా నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా కాంట్రాక్టర్ సకాలంలో పనులను పూర్తిచేయలేక పోయారు. ఈ ప్రాజెక్ట్ పని జ‌న‌వ‌రి 4, 2024 లోగా పూర్తి చేయాలని గడువు విధించామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు