ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా సిద్ధం : సజ్జల రామకృష్ణారెడ్డి

గురువారం, 3 ఆగస్టు 2023 (08:51 IST)
దేశంలో ఏ క్షణంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైకాపా సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో రూ.14 కోట్లతో అభివృద్ధి చేసిన జగ్గయ్యపేట - చిల్లకల్లు రోడ్డును బుధవారం ప్రారంభించిన ఆయన పలు కార్యక్రమాల అనంతరం ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మున్సిపల్‌ కూడలిలో జరిగిన సభలో ప్రసంగించారు. 
 
ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో చేసిన అభివృద్ధితో పోలిస్తే ఏ రాష్ట్రంలో కూడా కనీసం 10 శాతం చేయలేదన్నారు. వైకాపా ప్రభుత్వంపై చేసేందుకు విమర్శలు లేక తెదేపా అధినేత చంద్రబాబు అనేక కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన పుత్రుడు లోకేశ్‌, దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌, ఎల్లో మీడియాను ఆసరాగా చేసుకొని టీడీపీని బతికించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 
టీడీపీ కుయుక్తులకు మోసపోకుండా జనం, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సజ్జలతోపాటు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, తితిదే పాలకవర్గ సభ్యుడు సుబ్బారావు, వైకాపా వైద్య విభాగం అధ్యక్షుడు మహబూబ్‌, పార్టీ ఇన్‌ఛార్జి రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు