ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలను వేధించే ప్రతి పోలీస్ అధికారికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ హెచ్చరించారు.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన వైకాపా కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత జగన్ మీడియాతో మాట్లడుతూ, తప్పు చేసే ప్రతి పోలీస్ అధికారికి భవిష్యత్లో శిక్ష తప్పదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలూడదీసి ఉద్యోగాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి కొమ్ముకాస్తూ వైకాపా శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు.
తప్పు చేసినన ఏ ఒక్క పోలీస్ అధికారిని వదలం. బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటూ పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యకాండ రాష్ట్రంలో పెరిగిపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం పోలీసులు ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారని, అలా చేస్తే భవిష్యత్లో చిక్కుల్లో పడతారన్నారు.