ఒక్క రూపాయికే విమాన టిక్కెట్!

గురువారం, 14 డిశెంబరు 2017 (11:53 IST)
కేవలం ఒక్క రూపాయికే విమాన టికెట్టా..? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును. ఇది నిజమే. దేశీయ తొలి బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌డెక్కన్‌ మళ్లీ వైమానిక మార్కెట్లోకి రానుంది. త్వరలోనే ఈ ఎయిర్‌లైన్‌ తిరిగి సేవలను ప్రారంభించనుందట. అయితే ప్రచారంలో భాగంగా కొందరు లక్కీ ప్రయాణికులకు రూపాయికే విమాన టికెట్‌ ఇవ్వనుందట.
 
నిజానికి ఎయిర్ డెక్కన్ సేవలు గత 2003లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో విలీనమయ్యాయి. ఈ సంస్థ ఆర్థిక కష్టాల్లో కూరుకోవడంతో గత 2012లో మూసివేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎయిర్‌లైన్‌ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనుందట. ఆ కంపెనీ అధిపతి జీఆర్ గోపీనాథ్ తాజాగా ఓ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఈ నెలాఖరులో ముంబై - నాసిక్‌ల మధ్య తొలి విమాన సేవలు ప్రారంభించనుంది. ఆతర్వాత ఢిల్లీ, కోల్‌కతా, షిల్లాంగ్‌ నుంచి సమీపంలోని నగరాలకు విమానాలు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సేవల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఒక్క రూపాయికే టిక్కెట్ ఆఫర్‌ను ప్రకటించినట్టు ఆయన తెలిపారు. అయితే, ఈ ఆఫర్ కేవలం లక్కీ ప్రయాణికులు మాత్రమేనని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు