ఎయిరిండియా కీలక నిర్ణయం : ఢిల్లీ - వాషింగ్టన్ డీసీల మధ్య విమాన సర్వీస్ నిలిపివేత

ఠాగూర్

మంగళవారం, 12 ఆగస్టు 2025 (15:03 IST)
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ - వాషింగ్టన్ డీసీల మధ్య నడిచే నాన్ స్టాప్ విమాన సర్వీసును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ఆపరేషనల్ సంబంధిత పరిమితుల దృష్ట్యా ఈ రూట్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 26 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలకు రెట్రోఫిట్ చేపడుతున్నందున విమానాల కొరత ఉంటుందని, అలాగే, పాకిస్థాన్ గగనతలం మూసివేత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. విమానాల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత నెలలోనే బోయింగ్ 787-8 విమానాలు రిట్రోఫిట్ చేయడం ప్రారంభించినట్లు పేర్కొంది.
 
కస్టమర్ల ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో చేపట్టిన ఈ విస్తృతమైన కార్యక్రమం వల్ల 2026 చివరి వరకు ఎప్పుడైనా కొన్ని విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చని ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు పాకిస్థాన్ మీదుగా గగనతలం మూసివేత కొనసాగుతుండటం వల్ల విమానాల సుదూర కార్యకలాపాలపై ప్రభావం పడుతోందని తెలిపింది. 
 
ఆపరేషనల్ సమస్యల నేపథ్యంలో ఈ విమానాల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు పునరుద్ఘాటించింది. సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత వాషింగ్టన్ డీసీకి లేదా అక్కడి నుంచి ఢిల్లీకి టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికుల్ని సంప్రదించి.. వారి వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఇతర విమానాల్లో రీబుకింగ్ లేదా పూర్తి రిఫండ్ సహా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను సైతం అందిస్తామని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు