దసర స్పెషల్ : 392 ప్రత్యేక రైళ్లకు రైల్వే శాఖ పచ్చజెండా

బుధవారం, 14 అక్టోబరు 2020 (10:19 IST)
దసరా, దీపావళి పండుగ సీజన్‌లో ఏర్పడే ప్రయాణికుల రద్దీని నివారించేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే 30వ తేదీ వరకు మొత్తం 392 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంచనా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
దుర్గాపూజ, దసరా, దీపావళి, ఛాత్‌ పూజ తదితర పండుగల వేళ పెరుగనున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కోల్‌కతా, పాట్నా, వారణాసి, లక్నో తదితర కేంద్రాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే 300కిపైగా మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్న విషయం తెల్సిందే. పండుగల సందర్భంగా నడిపే ప్రత్యేక రైళ్లు వచ్చేనెల 30 వరకే పరిమితమని స్పష్టం చేసింది. ప్రత్యేక రైళ్లలో మాదిరిగానే ప్రయాణ చార్జీలు రెగ్యులర్‌ రైళ్ల కంటే 10-30 శాతం అధికంగా వసూలు చేయనున్నారు. 
 
మరోవైపు, గుంటూరు రైల్వే జంక్షన్‌ మీదుగా ఐదు రైళ్లకు రైల్వేబోర్డు తాత్కాలిక అనుమతి ఇచ్చింది. అక్టోబరు 20వ తేదీ నుంచి నవంబరు 30వ తేదీ వరకు శబరి, నారాయణాద్రి, నరసాపూర్‌, అమరావతి, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ల రాకపోకలకు బోర్డు మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపింది. ఈ రైళ్లన్నీ పాత సమయపట్టిక ప్రకారమే నడుస్తాయి. వీటిల్లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం నుంచే నడపడం ప్రారంభించారు. 
 
ఇప్పటికే తిరుపతి - విశాఖపట్నం - తిరుపతి వారంలో మూడు రోజులు ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌కి రైల్వేబోర్డు అనుమతించిన విషయం తెలిసిందే. రానున్న దసరా, దీపావళి పండగల సందర్భంలో సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరుపతి, శబరిమల, తిరువనంతపురం, విశాఖటపట్నం ప్రాంతాల నుంచి రాకపోకలకు ఈ రైళ్లు ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. ఈ రైళ్లన్నింటికీ తత్కాల్‌ ఛార్జీ వసూలు చేస్తారు. అలానే త్రీటైర్‌ ఏసీ కోచ్‌లు ఎక్కువగా అందుబాటులో ఉంచుతారు. 
 
ఇకపోతే, గతంలో రైల్వేబోర్డు ఆమోదించిన కొత్త ఏసీ రైలుని ఈ నెల 17వ తేదీ నుంచి గుంటూరు మీదుగా నడిపేందుకు రైల్వేబోర్డు టైంటేబుల్‌ విడుదల చేసింది. నెంబరు. 02784 సికింద్రాబాద్‌ - విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 17వ తేదీన సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరిరాత్రి 10.50కి గుంటూరుకు చేరుకొంటుంది. 
 
ఆ తర్వాత 10.55 గంటలకు బయలుదేరి 11.55కి విజయవాడ, అర్థరాత్రి దాటాక 12.49కి ఏలూరు, 1.19కి తాడేపల్లిగూడెం, 2.05కి రాజమండ్రి, 2.49కి సామర్లకోట, 3.14కి అన్నవరం, 3.24కి తుని, 5.19కి అనకాపల్లి, 6.03కి దువ్వాడ, 6.50కి విశాఖపట్నం చేరుకొంటుంది. 
 
ఈ నెల 18వ తేదీ నుంచి నెంబరు.02783 విశాఖపట్నం - సికింద్రాబాద్‌ ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి 7.25కి దువ్వాడ, 7.39కి అనకాపల్లి, 8.19కి తుని, 8.34కి అన్నవరం, 9.04కి సామర్లకోట, 9.55కి రాజమండ్రి, 10.34కి తాడేపల్లిగూడెం, 11.06కి ఏలూరు, అర్థరాత్రి దాటాక 12.50కి విజయవాడ, 2 గంటలకు గుంటూరు ఆ తర్వాత నాన్‌స్టాప్‌గా మారి మరుసటి రోజు ఉదయం 7.40కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైలు మొత్తం ఫస్టు, సెకండ్‌, థర్డ్‌ ఏసీలు కలిపి 20 బోగీలతో నడుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు