అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

శుక్రవారం, 30 జులై 2021 (10:33 IST)
తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను హైదరాబాద్‌ లక్డీకపూల్‌లోని పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. 
 
ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం 151 పోస్టులు వున్నాయి. మల్టీ జోన్-1లో 68 పోస్టులు, మల్టీ జోన్‌-2లో 83 పోస్టులు ఉన్నాయి. ఇక విద్యార్హత చూస్తే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ పూర్తి చేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం ఉండాలి.
 
అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఆగస్టు 11 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 29 అర్థరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
 
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి 1,33,630 వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ ఫీజును రూ. 1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 750గా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు