దేశంలో 46 వేలకు చేరిన కరోనా కేసులు - ఫేస్‌మాస్కులు తప్పనిసరి

మంగళవారం, 5 మే 2020 (17:46 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య 46 వేలు దాటిపోయింది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరిగింది. గత 24 గంటల్లో 195 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ మృతులతో కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 1568 మంది చనిపోయినట్టు తెలిపారు. ఇకపోతే, దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 46433కు చేరింది. గత 24 గంటల్లో 1020 మందికి ఈ వైరస్ సోకినట్టు చెప్పారు. అలాగే, ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 27.41 శాతంగా ఉందని తెలిపారు. 
 
మరోవైపు, కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాస్తవ మాట్లాడుతూ, లాక్‌డౌన్ అమలు కోసం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. పెళ్లి వేడుకకు 50 మంది మాత్రమే హాజరు కావాలని, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని తెలిపారు. 
 
అలాగే, ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్యాలయాల్లో సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేయాలని కోరారు. ఫేస్ మాస్క్‌లను, శానిటైజర్లను సిబ్బందికి సరిపడా అందించాల్సిన బాధ్యత ఇంఛార్జ్‌లదేనని కేంద్రం స్పష్టం చేసింది. కార్యాలయాల్లో కూడా భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌‌ను వినియోగించాలని ఆమె తెలిపారు.
 
మరోవైపు, నోయిడా పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులంతా ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్న నిబంధన విధించింది. ఇదిలేకుంటే ఆర్నెల్ల జైలుతో పాటు.. భారీ అపరాధం విధిస్తామని నోయిడా నగర పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు