దేశంలో మరణ మృదంగం .. ఒకే రోజు 4329 మంది మృత్యువాత

మంగళవారం, 18 మే 2021 (10:09 IST)
దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. ఈ వైరస్ సోకిన అనేకమంది రోగులు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ముఖ్యంగా రోజువారిగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుముఖం పడుతున్నప్పటికీ... మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా కొత్త‌గా 2,63,533 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... సోమవారం 4,22,436 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,52,28,996కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో  4,329  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,78,719కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,15,96,512 మంది కోలుకున్నారు. 33,53,765 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,44,53,149 మందికి వ్యాక్సిన్లు వేశారు. 
 
ఇదిలావుంటే, కరోనా మరణాల్లో ఏపీ రికార్డులమీద రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 109 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా కలకలం మొదలైన తర్వాత ఒకరోజులో ఇన్ని మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 
 
అలాగే ఏడు రోజుల వ్యవధిలో వందకుపైగా మరణాలు సంభవించడం ఇది మూడోసారి. ఈనెల 11న 108 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే రికార్డు కాగా.. సోమవారం ఈ రికార్డు బద్దలైంది. ఇక ఆదివారం కూడా రాష్ట్రంలో 101 మరణాలు సంభవించాయి. 
 
తాజాగా పశ్చిమగోదావరిలో 16 మంది చనిపోగా.. అనంతపురం, చిత్తూరు, గుంటూరులో పదేసి మంది చొప్పున, తూర్పుగోదావరి, విశాఖపట్నం 9 మంది చొప్పున, కృష్ణా, నెల్లూరు, విజయనగరంలో 8 మంది చొప్పున, కర్నూలు, శ్రీకాకుళంలో ఏడుగురు చొప్పున, ప్రకాశంలో నలుగురు, కడపలో ముగ్గురు చొప్పున మరణించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు