మళ్లీ తండ్రికాబోతున్న విరాట్ కోహ్లీ!!

ఠాగూర్

ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (12:24 IST)
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మళ్లీ తండ్రికాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుటుంబంతో అధిక సమయం గడపాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని కోహ్లీ స్నేహితుడు, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
 
తాజాగా యూట్యూబ్ లైవ్‌లో ఏబీ డివిలియర్స్ అభిమానులతో ముచ్చటించాడు. విరాట్ కోహ్లితో మాట్లాడారా? అతను బాగున్నారా? అని ఓ అభిమాని ఆయన్ని అడిగాడు. "ఇటీవల అతడితో చాటింగ్ చేశా. ఎలా ఉన్నావు. అని అడిగా. క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అతను తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. అందుకే ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నా. కోహ్లి రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు అతడు తన కుటుంబంతో ఉండటం ముఖ్యం. విరాట్ తన ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తున్నాడని చాలా మంది భావిస్తుండొచ్చు. కానీ, అది తప్పు. కోహ్లీని మేం కూడా మిస్ అవుతున్నాం. అతడు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకున్నాడు" అని డివిలియర్స్ అన్నాడు. 
 
కాగా, గత 2017లో బాలీవుడ్ నటి అనుష్క శర్మను విరాట్ కోహ్లీ వివాహం చేసుకున్నాడు. 2021లో వీరికి వామిక జన్మించింది. కోహ్లీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంగ్లండ్‌తో రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వాటిని కోహ్లీ సోదరుడు వికాస్ కొట్టిపారేశాడు. తమ తల్లి ఆరోగ్యంగానే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఇక, ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఆ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు