నాలుగో టెస్టుపై నీలి నీడలు - మళ్లీ క్వారంటైన్ మా వల్ల కాదంటున్న క్రికెటర్లు!

ఆదివారం, 3 జనవరి 2021 (10:31 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇందులోభాగంగా, నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు టెస్టులు ముగిశాయి. మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే, బ్రిస్బేన్‌లో జ‌ర‌గాల్సిన నాలుగో టెస్ట్ మ్యాచ్ నిర్వహణ ఇపుడు సందిగ్ధంలో ప‌డింది. 
 
దీనికి కారణం క్వీన్స్‌ల్యాండ్‌లో క‌ఠినమైన క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉండ‌టమే. ఈ నిబంధ‌న‌ల‌కు భారత క్రికెట్ జట్టు ఏమాత్రం సమ్మతించడం లేదు.జ‌న‌వ‌రి 15న నాలుగో టెస్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. క్వీన్స్‌ల్యాండ్‌లో క‌రోనా కేసులు పెరిగిపోతుండ‌టంతో త‌మ రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌ను మూసేసింది అక్క‌డి ప్ర‌భుత్వం. భారత్, ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ చార్ట‌ర్డ్ విమానాల్లో అక్క‌డికి వెళ్ల‌నున్నారు. 
 
అయితే బ్రిస్బేన్‌కు వెళ్లిన త‌ర్వాత ప్రాక్టీస్‌, మ్యాచ్‌ల సంద‌ర్భంగానే టీమ్స్ బ‌య‌ట‌కు రావాల‌ని, మిగ‌తా స‌మ‌యం మొత్తం హోట‌ల్ రూమ్‌ల‌కే ప‌రిమితం కావాల‌ని ఆస్ట్రేలియా టీమ్‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
భారత క్రికెట్ జట్టుకు ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి ఆదేశాలు రాక‌పోయినా.. ఈ క‌ఠిన నిబంధ‌న‌లు త‌మ వ‌ల్ల కాద‌ని టీమ్ అధికారి ఒక‌రు స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే దుబాయ్‌, సిడ్నీల్లో క‌లిపి 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నామ‌ని, ఇంకా క్వారంటైన్ అంటే కుద‌ర‌ద‌ని ఆ అధికారి తేల్చి చెప్పారు. 
 
ఒక‌వేళ క్వీన్స్‌ల్యాండ్ ప్ర‌భుత్వం ఇండియ‌న్ టీమ్‌కు క్వారంటైన్ నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌క‌పోతే.. సిడ్నీలోనే నాలుగో టెస్ట్ కూడా జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇండియ‌న్ టీమ్ మాత్రం ఈ నిబంధ‌న‌ల‌ను అంగీక‌రించే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. 
 
ఆరు నెల‌లుగా క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలోనూ విదేశీ టూర్‌ల‌లో త‌మ టీమ్‌తో ఎలాంటి స‌మ‌స్య‌లు రాలేద‌ని, ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని ఆ అధికారి అంటున్నారు. మ‌రి క్రికెట్ ఆస్ట్రేలియా దీనిపై ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు