తీరు మారని భారత బ్యాట్స్‌మెన్... భారత్ మళ్లీ పాతకథ

గురువారం, 25 జనవరి 2018 (11:59 IST)
మూడో టెస్టులోనూ భారత బ్యాట్స్‌మెన్ తీరు మారలేదు. సౌతాఫ్రికాతో బుధవారం నుంచి ప్రారంభమైన చివరి టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన సౌతాఫ్రికా బుధవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి ఆరు పరుగులు చేసింది. 
 
ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా కనీసం మూడో టెస్టులోనైనా ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై తమ బలహీనతను మరోసారి చాటుతూ టీమిండియా 76.4 ఓవర్లలో 187 పరుగులకే చాప చుట్టేసింది. సఫారీ బౌలర్లు సమష్టిగా రాణించి భారత ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
 
భారత ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ 8, లోకేష్ రాహుల్ 0, చటేశ్వర్ పుజారా 50, విరాట్ కోహ్లి 54, అజింక్య రహానె 9, పార్థివ్ పటేల్ 2, హార్దిక్ పాండ్య 0, భువనేశ్వర్ కుమార్ 30, మహ్మద్ షమి 8, ఇషాంత్ శర్మ 0, బుమ్రా నాటౌట్ 0 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 26 పరుగులు వచ్చాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు