చెన్నై టెస్టులో భారత క్రికెట్ జట్టు ఘన విజయం.. సిరీస్ లెవల్

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:56 IST)
చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ సమమైంది. ఇదే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ తొలి టెస్టులో ఎదురైన దారుణ ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకుంది. 
 
స్పిన్ పిచ్‌పై ఇంగ్లండ్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్న‌ర్లు.. 317 ప‌రుగుల భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయ‌గా.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టామ్ స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ 5 వికెట్లు తీయ‌డం విశేషం. 
 
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 134 ప‌రుగుల‌కు ఆలౌటైన ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 164 ప‌రుగుల‌కే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో చివ‌ర్లో మెరుపులు మెరిపించిన మోయిన్ అలీ 43 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 
 
మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీయ‌డంతో పాటు సెంచ‌రీ చేసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప‌రుగుల ప‌రంగా టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో టీమిండియాకు ఇది ఐదో భారీ విజ‌యం కావ‌డం విశేషం.
 
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 286 రన్స్ చేసింది. అలాగే, ఇంగ్లండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 134 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 164 రన్స్ చేసి ఓటమి పాలయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు