బీసీసీఐకి కొత్త సారథి గంగూలీ... ఇక విరాట్ కోహ్లీకి కష్టాలేనా?

బుధవారం, 23 అక్టోబరు 2019 (20:31 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సారథిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష పదవికి జరిగిన పోరులో గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నో సవాళ్లను ఎదురుకుని, సమర్థవంతంగా ముందుకు నడిపించానని, అలాగే, బీసీసీఐను ముందుకు నడిపిస్తానని చెప్పారు. అంతేకాక.. టీం ఇండియాను ప్రపంచంలో ఉత్తమమైన జట్టుగా తీర్చిదిద్దేందుకు విరాట్‌తో కలిసి పని చేస్తానని ఆయన అన్నారు.
 
కోహ్లీ గురువారం మాట్లాడుతానని చెప్పాడు. భారత జట్టు కెప్టెన్‌‌గా అతను చాలా ముఖ్యమైన వ్యక్తి. నేను అలాగే చూస్తాను. అతనికి అన్ని విధాలుగా మద్దతు ఇచ్చి.. భారత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. 
 
గత నాలుగేళ్లలో భారత్‌ని చూస్తే.. అది చాలా ఉత్తమమైన జట్టు అని తెలుస్తుంది. జట్టును మరింత పటిష్టంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. విరాట్‌తో గతంలో ఎలా ఉన్నానో.. అలాగే ఉంటాను. ఇండియా కోసం అడేందుకు అతనికి అవసరమైనవి అన్ని సమకూరుస్తాను. భారత జట్టును కోహ్లీ మరింత ఎత్తుకు తీసుకువెళ్లాడు. ఇప్పటివరకూ అతనికి మద్దుతగా ఉన్నాము.. ఇకపై ఉంటాము కూడా అని చెప్పుకొచ్చారు. 
 
అదేసమయంలో బీసీసీఐలో ఎటువంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతి విషయంలో వెనక్కి తగ్గేది లేదు. అవినీతి లేని బీసీసీఐని నిర్మించడమే ప్రధాన లక్ష్యం. అంతేకాక.. బోర్డులో ఉన్న ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయి. ఇక్కడ ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదు. ప్రతీ ఒక్కరికి న్యాయం సమానంగా ఉంటుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు