ఆసియా కప్ టోర్నీలో భారత్ క్రికెటర్ల చేతిలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చావు దెబ్బ తింది. ఒక లీగ్ మ్యాచ్, ఒక సూపర్ ఫోర్ మ్యాచ్, ఆపై ఫైనల్ మ్యాచ్లో అంటే వరుసగా మూడు మ్యాచ్లలో పాక్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణించింది. తమ ఆటగాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. ఇకపై పాక్ క్రికెటర్లు విదేశీ టీ20 లీగుల్లో పాల్గొనకుండా నిరోధించాలని బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.
విదేశీ లీగుల్లో ఆడాలంటే ఆటగాళ్లు తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్.ఓ.సి) పొందడం తప్పనిసరి చేసింది. అయితే, ఇకపై తమ ఆటగాళఅలకు ఈ ఎన్.వో.సిలు జారీ చేయకూడదని పీసీబీ భావిస్తోంది. ఆసియా క్రికెట్ టోర్నీలో మూడు సార్లు భారత్ చేతిలో ఓడిపోవడాన్ని పీసీబీ పెద్దలతో పాటు ఆ దేశ ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా, ఫైనల్ మ్యాచ్లో కప్పు అందినట్టే అంది చేజారిపోయింది. ఈ విషయంపై పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ ఇప్పటికే కీలక ప్రకటన చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
విదేశీ లీగుల్లో ఆడటం వల్ల ఆటగాళ్లలో నిలకడ లోపిస్తోందని, వారి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడుతోందని, పీసీబీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ నిర్ణయం పాక్ క్రికెటర్లకు ఆటపరంగానేకాకుండా ఆర్థికపరంగా కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. పీసీబీ నుంచి వచ్చే జీత భత్యాలు అంతంత మాత్రంగానే ఉండటంతో విదేశీ లీగుల ద్వారా వారు భారీ మొత్తంలో అర్జించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.