నా కొడుకు సత్తా ఉంటే రాణిస్తాడు .. లేదంటే... : సచిన్ టెండూల్కర్

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:06 IST)
ఐపీఎల్ 14వ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టులోకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ ఎంపికయ్యాడు. సచిన్ సిఫార్సు వల్లే ముంబై ఇండియన్స్ జట్టు అతన్ని కొనుగోలు చేసిందన్న కామెంట్స్ వస్తున్నాయి. వీటిపై సచిన్ పరోక్షంగా స్పందించాడు. ఏ ఆటగాడైనా సత్తా ఉంటేనే మైదానంలో రాణించగలడని, బ్యాగ్రౌండ్‌తో పనిలేదన్నారు. 
 
అన్అకడామీ అనే ఈలెర్నింగ్ పోర్టల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత వర్చువల్‌గా మీడియాతో మాట్లాడాడు. విద్యార్థులతోనూ మమేకమయ్యాడు. కొత్త కొత్త మార్గాల ద్వారా అందరినీ క్రీడలు ఏకం చేస్తున్నాయన్నాడు. 
 
టీం కోసం ఓ వ్యక్తిగా ఏం చేయాలో అది చేయాలని విద్యార్థులకు సూచించాడు. తన విద్యాభ్యాసం మొత్తంలో ఎన్నెన్నో స్కూళ్లు మారానని, వేర్వేరు కోచ్‌లను కలిశానని చెప్పుకొచ్చాడు. వారి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు.
 
కలలను నిజం చేసుకోవడానికి ఎప్పుడూ శ్రమిస్తూనే ఉండాలంటూ విద్యార్థులకు సచిన్ సూచించాడు. మనల్ని మనం ఎంత ముందుకు తీసుకెళ్తే.. అన్ని విజయాలు సాధిస్తామన్నాడు. ఏదైనా సాధించలేకపోతే అక్కడితోనే అయిపోయిందన్న నిరాశ వద్దని, మరో అడుగు ముందుకేసి అనుకున్నది సాధించాలని స్ఫూర్తి నింపాడు.
 
అంతేకాకుండా, ఓ ఆటగాడి బ్యాగ్రౌండ్‌తో క్రీడలకు పని లేదని, ఫీల్డ్‌లో అతడి సత్తాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. ‘‘డ్రెస్సింగ్ రూంలోకి అడుగు పెట్టే ప్రతిసారీ.. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడివి? నీ బ్యాగ్రౌండ్ ఏంటి? అన్నది అసంబద్ధం. ప్రతి ఒక్క ఆటగాడూ అక్కడ సమానమే’’ అని చెప్పుకొచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు