అతడి గుండె బద్దలైంది... టీ20 వరల్డ్ కప్‌లో రింకూ సింగ్‌కు నో బెర్త్.. తండ్రి కామెంట్స్

ఠాగూర్

గురువారం, 2 మే 2024 (11:21 IST)
జూన్ నెలలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ జట్టులో యువ కెరటం రింకూ సింగ్‌కు చోటు దక్కుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జాతీయ సెలెక్టర్లు రింకూ సింగ్‌కు మొండి చేయి చూపించారు. 
 
టీమిండియా తుది జట్టులోనే కాదు 15 మంది సభ్యుల జట్టులో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అయితే రిజర్వుడ్ ఆటగాళ్ల జాబితాలో చోటిచ్చారు. రింకూ సింగ్‌కు టీ20 జట్టులో చోటు దక్కకపోవడంపై అతడి తండ్రి ఖాన్ చంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటుదక్కుతుందని ఆశించామని, అందుకే కొంచెం విచారంగా ఉందని ఖాన్ చంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. రింకూ సింగ్‌కి చోటు దక్కితే సెలబ్రేట్ చేసుకోవడానికి ముందస్తుగా స్వీట్లు, క్రాకర్లు తెచ్చుకున్నామని తెలిపారు. తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనుకున్నాం కానీ అలా జరగలేదని అన్నారు. 'భారత్ 24'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ చంద్రసింగ్ ఈ విషయాన్ని చెప్పారు.
 
రింకూ ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించిగా 'అతడి గుండె బద్దలైంది. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదని తెలిశాక ముందుగా అమ్మకు రింకూ ఫోన్ చేశాడు. తుది జట్టులోనే కాదు.. 15 మంది సభ్యుల టీమ్ కూడా చోటు దక్కలేదని చెప్పాడు. అయితే రిజర్వ్ ఆటగాడిగా జట్టుతో కలిసి ప్రయాణిస్తానని రింకూ వివరించాడు అని ఖాన్ చంద్ర సింగ్ వివరించారు.
 
కాగా రింకూకు చోటు కల్పించకపోవడంపై సెలెక్టర్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు క్రికెట్ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన రింకూ ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొడుతున్న విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు