టీమిండియాకు ఏమాత్రం కలిసిరాని కమలనాథుల పాలన!!

సోమవారం, 20 నవంబరు 2023 (09:59 IST)
భారత క్రికెట్ జట్టుకు కేంద్రంలోని కమల నాథుల పాలన ఏమాత్రం కలిసిరావడం లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీమిండియా ఒక్కటంటే ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా గెలుచుకోలేక పోయింది. ముఖ్యంగా, గత 2011 తర్వాత ఇప్పటివరకు అనేక పలు ఐసీసీ ఈవెంట్స్ జరిగినప్పటికీ ఫైనల్ మ్యాచ్‌లలో తడబాటుకు గురై వట్టి చేతులతో తిరిగివస్తుంది. తాజాగా స్వదేశంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో కూడా ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో భారత జట్టుకు బీజేపీ పాలన ఏమాత్రం కలిసిరావడం లేదని అనేక మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే, ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించడం బీసీసీఐ కార్యదర్శి జై షా తీసుకున్న అతిపెద్ద తప్పుగా అభివర్ణిస్తున్నారు. 
 
తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓడిపోయిన విషయాన్ని పక్కనబెడితే ఇటీవల మన జట్టుకు విధి రాత ఏ మాత్రం కలిసిరావడం లేదు. ముఖ్యంగా 2011 తర్వాత ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఇంకా చెప్పుకుంటే 2014లో దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. 
 
2014లో టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015లో వన్డే ప్రపంచకప్ సెమీస్, 2016లో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019లో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, 2021లో టీ20 ప్రపంచకప్ లీగ్ దశ, 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, 2023 ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, తాజాగా 2023లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది.
 
దీంతో టీమిండియా ఐసీసీ టోర్నీ గెలవాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని కొందరు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం క్రీడలకు, రాజకీయాలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ సెక్రటరీ జై షా ఎవరు అని.. అమిత్ షా తనయుడు కాబట్టే బీసీసీఐలో రాజకీయాలు నడుస్తున్నాయని.. అసలు ఫైనల్ అహ్మదాబాద్‌‍లో పెట్టడం అవివేకం అని.. దీనికి బీజేపీ ప్రభుత్వ అత్యుత్సాహమే కారణమని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెంటిమెంట్లు ఉంటాయని.. వాటిని గౌరవించాలని హితవు పలుకుతున్నారు. 
 
ఫైనల్ మ్యాచ్‌ను ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ నిర్వహించి వుంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా టీమిండియా మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు విశ్వసించగా చివరకు వాళ్లకు నిరాశే మిగిలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు