క్రెస్ట్‌చర్చ్ మైదానంలో "సిక్స్‌"ల మోత

బుధవారం, 25 ఫిబ్రవరి 2009 (14:58 IST)
న్యూజిలాండ్‌లోని క్రెస్ట్‌చర్చ్‌ మైదానం సిక్స్‌ల మోతతో హోరెత్తిపోయింది. ఈ మైదానంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు పోటీ పడి సిక్స్‌ల వర్షం కురిపించారు. దీంతో ట్వంటీ-20 ఫార్మెట్‌లో అత్యధికి సిక్స్‌లు కొట్టిన మ్యాచ్‌గా క్రెస్ట్‌చర్చ్ ట్వంటీ-20 సరికొత్త రికార్డు సృష్టించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇన్నింగ్స్‌లో 13 సిక్స్‌లు, కివీస్ ఇన్నింగ్స్‌లో 11 సిక్స్‌లు ఆటగాళ్ళ బ్యాట్ల నుంచి జాలువారాయి. టీమ్ ఇండియాలో ఓపెనర్ సెహ్వాగ్ 4, సురేష్ రైనా 5, యూసుఫ్ పఠాన్ మూడు, రోహిత్ శర్మ ఒకటి సిక్స్‌లు బాదారు. అలాగే ఆతిథ్య కివీస్ జట్టులో ఓపెనర్ మెక్‌కల్లమ్, గుప్తిల్, టేలర్‌లు మూడేసి, జాకబ్ ఓరమ్ రెండు సిక్స్‌లు చొప్పున కొట్టారు.

కాగా, భారత ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, కివీస్ ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు కలిపి మొత్తం 16 సార్లు బంతి బౌండరీని ముద్దాడగా, సిక్స్‌ల రూపంలో 24 సార్లు బంతి స్టేడియంలోని స్టాండ్స్‌లలో పడటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి