వెస్టిండీస్‌ను ఓడించిన కోచ్ డైసన్

కోచ్ జాన్ డైసన్ తప్పుడు లెక్క వెస్టిండీస్ జట్టును ఓటమిపాలు చేశాయి. ఇక్కడి గయానా నేషనల్ స్టేడియంలో రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టును పాల్ కాలింగ్ వుడ్, ఒవైసీ షా అర్ధ సెంచరీలతో ఆదుకున్నాక, వెస్టిండీస్‌కు 50 ఓవర్లలో 271 పగుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

విండీస్ ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లు పూర్తయ్యాక, వెలుతురు తగ్గిపోతున్న సమయంలో, ఆట ఆసక్తి కరమైన మలుపు తిరిగింది. అప్పటికి దినేష్ రామ్ దిన్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బంతిలో ఎల్బీగా వెనుదిరిగాడు. వెస్టిండీస్ స్కోరు 46.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు. డక్ వర్త్-లూయీస్ నిబంధన ప్రకారం ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ కూడా ధీమాగా ఉన్నాడు. కానీ... వెస్టిండీస్ కోచ్ జాన్ డైసన్ లెక్క తప్పయింది.

లక్ష్యానికి ఇంకా రెండు పరుగులు తక్కువ ఉండగానే, తాము గెలిచామనుకుని, బ్యాట్స్ మెన్‌ను వెనక్కు వచ్చేయమన్నాడు. తరువాత విషయం తెలుసుకుని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ దగ్గరకు పరుగెత్తాడు. అప్పటికే పొరపాటు జరిగిపోయింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు 1-0 ఆధిక్యత లభించింది. ఎంతో కష్టపడి విండీస్ జట్టును గెలుపు అంచుల్లోకి తీసుకువెళ్లిన లెండిల్ సిమ్మన్స్ (62), రామ్ నరేష్ శర్వాన్ (57), శివ్‌నారాయణ్ చందర్ పాల్ (46), కీరన్ పోలర్డ్ (42)ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరులా మారింది.

వెబ్దునియా పై చదవండి