ట్వంటీ-20 మ్యాచ్: కివీస్ విజయలక్ష్యం 163

క్రెస్ట్‌చర్చిలో జరుగుతున్న తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత జట్టు కివీస్ ముంగిట 163 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. కాగా, టీమ్ ఇండియాలో 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లలో 61 పరుగులతో రాణించిన రైనా, జట్టును ఆదుకున్నాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ వెట్టోరి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభం అదిరింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న సెహ్వాగ్ నాలుగు ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతకుముందు గంభీర్ (6) పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన రైనా నింపాదిగా ఆడసాగాడు. అయితే.. శర్మ (7), యువరాజ్ సింగ్ (1) ధోనీ (2)లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 61 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లను కోల్పోయింది. అనంతరం రైనాతో జతకలిసిన యూసుఫ్ పఠాన్ ఎనిమిది బంతుల్లో 20 పరుగులు చేసి జట్టు స్కోరు వేగాన్ని పెంచాడు.

మెక్‌కల్లమ్ బౌలింగ్‌లో వరుసగా నాలుగో సిక్స్‌కు ప్రయత్నించిన యూసుఫ్.. బౌండరీలైన్ వద్ద జాకబ్ ఓరమ్ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 82 పరుగులు. అయితే ఒక వైపు క్రీజ్‌లో నిలదొక్కుకున్న రైనాతో ఇర్ఫాన్ పఠాన్ కలిసి జట్టు స్కోరును వంద దాటించి, పఠాన్ అవుట్ అయ్యాడు.

క్రీజ్‌లోకి వచ్చిన హర్భజన్ 22 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే ఓవర్లు ముగియడంతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సురేష్ రైనా 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బ్రియాన్, బట్లర్‌లు రెండేసి వికెట్లు తీయగా, సౌథీ, వెట్టోరి, మెక్‌కల్లమ్, రైడర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

వెబ్దునియా పై చదవండి