దేశంలో మహిళలకు భద్రతలేకుండా పోయింది. రాత్రిపూటే కాదు పట్టపగలు కూడా యువతులు ఒంటరిగా నిర్భయంగా తిరగలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. చివరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా వెంటిలేటరుపై చికిత్స పొందుతున్న ఎయిర్హోస్టెస్పై అఘాయిత్యం జరిగింది. ఈ దారుణ ఘటన ఢిల్లీ ఎన్.సి.ఆర్ పరిధిలోని గురుగ్రామ్లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బాధిత ఎయిర్ హోస్టెస్ గురుగ్రామ్లోని ఓ హోటల్లో బస చేసింది. ఈ నెల 5వ తేదీన అక్కడున్న ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తుండగా, కిందపడటంతో అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను సమీపంలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు.
మరుసటిరోజున అక్కడ వెంటిలేటరుపై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్పై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే, ఈ విషయాన్ని ఆమె ఎక్కడా బయటకు చెప్పలేదు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఆ తర్వాత కోర్టులో న్యాయమూర్తి ఎదుట బాధితురాలు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే, నిందితుడుని గుర్తించేందుకు ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.