కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

ఠాగూర్

ఆదివారం, 1 జూన్ 2025 (19:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలోని ఓ ఆశ్రమంలో జాతీయ తైక్వాండో క్రీడాకారిణిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తమందు కలిపిన లడ్డూను తినిపించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొది. నిందితుల్లో ఆలయ పూజారులు కూడా ఉండటం గమనార్హం. అత్యాచారం చేసిన తర్వాత అశ్లీల వీడియోలు తీసి బాధితురాలిని బెదిరించారు కూడా. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
బాధితురాలి కథనం మేరకు.. ఆశ్రమ వద్ద దుకాణం ఏర్పాటు కోసం సహాయం చేస్తానని ఆ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధుడు యువతతో నమ్మబలికాడు. ఇందుకోసం నాలుగు వేల రూపాయలు డిమాండ్ చేసి, ఆశ్రమంలోని కొందరు పలుకుబడిగల వ్యక్తులతో సమావేశం ఏర్పాటు చేస్తానని, వారు దుకాణానికి స్థలం ఇప్పిస్తారని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు, జనవరి 28వ తేదీన వృద్ధుడితో కలిసి ఆశ్రమానికి వెళ్లింది. 
 
అక్కడ తనకు మత్తుమందు కలిసిన లడ్డూను తినడానికి ఇచ్చారని, అది తిన్న తర్వాత స్పృహ కోల్పోయానని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత ఆ వృద్ధుడు, ఆశ్రమానికి చెందిన ప్రధాని పూజారి, మరో ఇద్దరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. 
 
అంతేకాకుండా, ఈ దారుణాన్ని వారు అశ్లీల వీడియో తీసి, దానిని బయటపెడతామని బెదిరించినట్టు కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తీవ్ర భయాందోళనకు గురైన ఆమె, చివరకు ధైర్యం చేసి గురువారం డీసీపీ సౌత్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు