ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

ఠాగూర్

ఆదివారం, 1 జూన్ 2025 (11:28 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రభుత్వ వైద్యురాలు తన సర్వీస్ చివరి రోజున సస్పెండ్‌కు గురయ్యారు. ఆమెపై అవినీతి ఆరోపణలు రావడం, నకిలీ ధృవపత్రం సమర్పించడం వంటి కారణాలతో ఆరోగ్య శాఖ ఈ కఠిన చర్యలు తీసుకుంది. ఆమె గతంలో తెన్‌కాశి ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసిన సమయంలో ఈ అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. దీంతో ఆమెను సర్వీస్ చివరి రోజున సస్పెండ్‌కు గురయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
డాక్టర్ శ్రీపద్మావతి తెన్‌కాశి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్నపుడు రోగులకు ఆహారం అందించేందుకు అవసరమైన ఆకు కూరల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాల వెలుగులోకి వచ్చాయి. రూ.25 విలువ చేసే ఒక్కో ఆకు కూర కట్టను రూ.80 చొప్పున కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో చూపించారని విచారణలో నిర్ధారణ అయింది. 
 
అయితే, కొన్ని నెలల క్రితం శ్రీపద్మావతి తెన్‌కాశి ఆస్పత్రి నుంచి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి పరిపాలనాధికారిగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో మే 31వ తేదీన ఆమె సర్వీస్ నుంచి రిటైర్డ్ కావాల్సివుంది. ఈ నేపథ్యంలో గతంలో పని చేసిన ఆస్పత్రి నుంచి ఎలాంటి ఆరోపణలు లేవని ధృవీకరించే పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) సమర్పించాలని తూత్తుకుడి ఆస్పత్రి వైద్యాధికారులు ఆమెను కోరారు. అయితే, శ్రీపద్మావతి నకిలీ ధృవపత్రాన్ని అధికారులకు అందజేశారు. 
 
ఈ పత్రంపై అనుమానం వచ్చిన తూత్తుకుడి వైద్యాధికారులు తెన్‌కాశి ఆస్పత్రిలో క్షుణ్ణంగా విచారణ జరిపారు. ఈ విచారణలో శ్రీపద్మావతి సమర్పించింది నకిలీ ధృవపత్రమేనని తేలింది. దీంతో ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. దీంతో ఆరోగ్య శాఖ డాక్టర్ పద్మావతిని సస్పెండ్ చేస్తూ శనివారం అధికారికంగా ఆదేశాలు జారీచేసింది. రిటైర్మెంట్ రోజు ఇలా సస్పండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు