దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

ఠాగూర్

మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (17:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. తాను చెప్పిన మాట వినకుండా భార్య తనకు ఎదురు తిరగడాన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమెకు గుండు గీయించాడు. తనను అనవసరంగా దుర్భాషలాడటాన్ని భార్య నిలదీయడంతో ఆమెపై భర్త దాడి చేసి, పదునైన ఆయుధంతో బలవంతంగా గుండు గీశాడు. రాష్ట్రంలోని భదోహి జిల్లా బడా సియూర్ గ్రామంలో ఏప్రిల్ 24వ తేదీన ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
గ్రామానికి చెందిన రామ్ సాగర్ అనే వ్యక్తికి అతని భార్య బబిత(29)కు మధ్య అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రామ్ సాగర్ తన భార్యను ఉద్దేశించి తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించాడు. భర్త మాటలకు తీవ్రంగా నొచ్చుకున్న భార్య... ఆ అసభ్య భాష వాడకాన్ని గట్టిగా వ్యతిరేకించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రామ్ సాగర్... ముందుగా బబితను చంపేస్తానంటూ బెదిరించాడు. 
 
ఆ తర్వాత ఆమెపై భౌతికదాడి చేసి పదునైన వస్తువును ఉపయోగించి బలవంతంగా గుండు గీసి పైశాచికంగా ప్రవర్తించాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు తల్లికి ఫోన్ చేసి చెప్పి, పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు