చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పుల కలకలం... పోలీసుల అదుపులో నిందితులు

ఠాగూర్

బుధవారం, 12 మార్చి 2025 (12:36 IST)
చిత్తూరు జిల్లా గాంధీ రోడ్డు, లక్ష్మీ సినిమా మహాల్ సమీపంలో కొందరు దుండగులు మంగళవారం అర్థరాత్రి సమయంలో కాల్పులకు తెగబడ్డారు. పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని నివాసంలోకి ప్రవేశించిన దుండగులు... వారిని బెదిరించేందుకు గాల్లో కాల్పులు జరిపారు. అయితే, మాల్ యజమాని అప్రమత్తమై పోలీసులకు సకాలంలో సమాచారం చేరవేయడంతో పెను ముప్పు తప్పింది. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని నలుగురు దండుగులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, కత్తులతో పాటు పొగ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న దండగులను స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ పరిశీలించారు. మరో ఇద్దరు దుండగులు అక్కడే ఉన్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు పుష్పమాల్ ఇంటి యజమాని నివాసంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను గాలిస్తున్నారు. 
 
కాగా, ఎంతో ప్రశాంతంగా ఉండే చిత్తూరు జిల్లా కేంద్రంలో కొందరు దుండగులు కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాగా, ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పిందని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు