తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

ఠాగూర్

మంగళవారం, 29 జులై 2025 (08:57 IST)
తన తమ్ముుడుకి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన అక్క... తన భర్త సాయంతో అతన్ని కడతేర్చింది. అంత్యక్రియల సమయంలో మృతదేహం మెడపై గాయాలు ఉండటాన్ని గమనించిన తండ్రి... కుమార్తెను, అల్లుడుని నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్రదుర్గం జిల్లా హొళల్కెర పరిధిలోని దుమ్మి గ్రామానికి చెందిన నాగరాజప్పకు మల్లికార్జున, నిశా అనే ఇద్దరు సంతానం ఉన్నారు. నిశాకు శ్యామనూరుకు చెందిన మంజునాథ్‌తో వివాహం జరిపించారు. మల్లికార్జున బెంగుళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంజునాథ్ కారులో సొంతూరుకు వస్తుండగా, రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లికార్జునను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలో భాగంగా వివిధ రకాలైన రక్త పరీక్షలు చేశారు. ఇందులో మల్లికార్జునకు నయం కాని అరుదైన వ్యాధి సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని వైద్యులు అక్క నిశాకు తెలిపారు. బాధితుడుకి మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి కుటుంబ సభ్యులు వాహనంలో బయలుదేరారు. 
 
అయితే, మల్లికార్జున తనకు నయంకాని వ్యాధి సోకిదని, అప్పులు చేశానని, జీవించడానికి ఆసక్తి లేదని అక్కబావ వద్ద బోరున విలపిస్తూ చెప్పాడు. దీంతో తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలియకూడదని కూడదని, తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భావించిన నిశా.. తన భర్తతో కలిసి సోదరుడు మల్లికార్జున మెడకు టవల్ బిగించి హత్య చేశారు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి, ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించారు. కానీ, అంత్యక్రియల సమయంలో మల్లికార్జున మెడపై గాయాలు ఉండటాన్ని గమనించిన తండ్రి.. కుమార్తెను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిశా, మంజునాథ్‍‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు