ఒకవైపు కట్టుకున్న భర్త అనారోగ్యానికి గురయ్యారు. మరోవైపు, ఒక రోజు సెలవు అడిగినందుకు ఉద్యోగిపై యాజమాన్యం కన్నెర్రజేసి, ఆమెను ప్రిన్సిపాల్ ఉద్యోగం నుంచి తప్పించారు. కొద్ది రోజులకు ఏకంగా ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. ఇలా వరుస కష్టాలు వెన్నంటడంతో ఆ మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన కడప జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
కడప జిల్లాకు చెందిన ముంగర సురేంద్రనాథ్, రత్నాకరం శ్రీవాణి (45) అనే దంపతులు గత కొంతకాలంగా స్థానిక శ్రీనివాసపురం కాలనీలో ఉంటున్నారు. సురేంద్రనాథ్ కోడూరు ఎల్ఐసీ ఆఫీసులో అసిస్టెంట్ అడ్మినస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈయన ప్రతి రోజూ తిరుపతి నుంచి డ్యూటీకి వెళ్లి వస్తుంటారు. శ్రీవాణి రెండేళ్లుగా నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ప్రిన్సిపాల్గా పని చేస్తుంది. అయితే, కాలేయ సమస్య కారణంగా తన భర్త అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది.
ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఒక రోజు సెలవు కావాలని పాఠశాల యాజమాన్యాన్ని శ్రీవాణి కోరింది. అయితే, పరీక్షల సమయంలో సెలవులు ఇవ్వలేమని నిరాకరించి, ఆమె స్థానంలో మరొకరిని ప్రిన్సిపాల్గా నియమించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమెను ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తీవ్ర మనస్థాపానికు గురైన ఆ మహిళ... మంగళవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతులకు విదేశాలల్లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.