సాఫీగా సాగిపోతున్న పచ్చని సంసారంలో ఇన్సస్టాగ్రామ్ ప్రేమ చిచ్చుపెట్టింది. తన ప్రియుడుతో కలిసివుండేందుకు ఏకంగా కట్టుకున్న భర్తనే చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా నంగనాచిలా బంధువుల ముందు తన భర్త కనిపించడం లేదంటూ నటించసాగింది. కానీ, పోలీసుల ఎంట్రీతో ఈ లేడీ యూట్యూబర్ గుట్టురట్టయింది. హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే,
హర్యానా రాష్ట్రంలోని భివానీలో కాపురం ఉంటున్న రవీనా అనే యూట్యూబర్, ప్రవీణ్ (35)లకు గత 2017లో వివాహమైంది. వీరికి ఆరేళ్ళ కుమారుడు కూడా ఉన్నారు. అయితే, రవీనాకు రెండేళ్ళ క్రితం ఇన్స్టాగ్రామ్లో ప్రేమ్ నగర్కు చెందిన యూట్యూబర్ సురేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ క్రమంలో ప్రియుడితో కలిసి రవీనా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేయసాగింది. ఇది నచ్చని భర్త, భార్యను మందలిస్తూ వచ్చాడు. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అదేసమయంలో ప్రవీణ్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని పీడ వదిలించుకుని ప్రియుడుతో కలిసివుండాలన్న నిర్ణయానికి వచ్చేసింది.
ఇదిలావుంటే, గత నెల 25వ తేదీన రవీనా ఇంటికి ప్రియుడు సురేష్ వచ్చాడు. వీరిద్దరిని చూడగానే భర్త ప్రవీణ్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారిని నిలదీయడంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత అదేరోజు రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన ప్రవీణ్కు రవీనా, ప్రియుడు సురేష్ కలిసి గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్థరాత్రి 2.30 గంటల సమయంలో మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లి కాలువలో పడేశాడు.
సీసీటీవీ ఫుటేజీలో రవీనా, సురేష్లు బైకుపై ప్రయాణిస్తున్నట్టు, వారి మధ్యలో ప్రవీణ్ మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ గురించి కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పినా పొంతనలేని సమాధానాలు చెప్పింది. మృతుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... రవీనాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో రవీనాను అరెస్టు చేయగా, ఆమె ప్రియుడు సురేష్ పరారీలో ఉన్నాడు.