శొంఠితో కలిగే ప్రయోజనాలు ఏమిటి

గురువారం, 17 జూన్ 2021 (23:54 IST)
ఎండిన అల్లం శొంఠి అవుతుంది. అల్లం, శొంఠి రెండింటిలోను కొన్ని లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ, అల్లం ప్రధానంగా చలవచేస్తుంది. శొంఠి వేడి చేస్తుంది. జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది.
 
అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.
 
శరీరంలోని అగ్ని (జఠరాగ్ని) సక్రమంగా పని చేస్తుంటే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అగ్ని మందగించినా, విషమించినా శరీరానికి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అగ్నిని సక్రమంగా పని చేయించే ద్రవ్యాలలో అల్లం ఒకటి. ప్రతిరోజు ఉదయాన్నే చిన్నచిన్న అల్లం ముక్కలు 4 లేక 5 సైంధవ లవణంతో కలిసి, నమిలి తినడం ఆరోగ్యకరం. జలుబు – గొంతు నొప్పి ఉన్నప్పుడు అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని నాకడం వలన ఉపశమనం కలుగుతుంది. 
 
కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు 20.మి.లీ. అల్లం రసం 20 మి.లీ తేనె కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే సుఖ విరోచనం అయ్యి, కడుపులోని వాయువులు కూడా బయటికి పోయి, నొప్పి తగ్గుతుంది. అల్లం రసం తీసుకోవడం వలన మూత్రం సాఫీగా అవుతుంది. ఆకలి మందగించినపుడు అజీర్ణం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వికారం, నోటిలో రుచి తెలియకపోవడం – ఇలా జీర్ణ మండలానికి సంబంధించిన ఎటువంటి లక్షణాలకైనా అల్లం ఒక దివ్యౌషధం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు