పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... క్వెట్టా నుంచి పెషావర్కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు జకోబాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దుండగులు రైలు మార్గంలో ఐఈడీని అమర్చడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రతకు రైలు పట్టాలపై సుమారు మూడు అడుగుల లోతైన గొయ్యి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇకా తెలియాల్సివుంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
కాగా, జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు గతంలో దాడులకు గురైంది. ఈ యేడాది మార్చి నెలలో పాకిస్థాన్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఇదే రైలును హైజాక్ చేసి వందల మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న విషయం తెల్సిందే. వారిని రక్షించేందుకు పాక్ సైనిక బలగాలు రంగంలోకి దిగి అనేక మంది మిలిటెంట్లను హతమార్చింది.