సింధూ నదీ జలాల కోసం భారత్ను పాకిస్థాన్ ప్రాధేయపడుతోంది. తక్షణం నీటిని విడుదల చేయాలని పదేపదే కోరుతోంది. ఇందుకోసం భారత ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ జలాల నిలిపివేత ఒకటి. అప్పటి నుంచి పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలైంది. దీంతో పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది.
సింధూ జలాలను నిలిపివేస్తే తమ దేశంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పాకిస్థాన్ .. భారత్కు రాస్తున్న లేఖల్లో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖల్లో పేర్కొంది.
భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ లేఖలను ప్రోటోకాల్ ప్రకారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించినట్టు సమాచారం. అయితే, రక్తం నీరు, రెండూ కలిసి ప్రవహించలేవు అని ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెల్సిందే. పాకిస్థాన్తో చర్చలు జరిగితే కేవలం ఉగ్రవాదం, పీవోకే అంశాలపైనే ఉంటాయని తేల్చిచెప్పింది.