తప్పు చేయకపోయినా నిర్బంధమే - అరెస్టులే ... బలూచిస్థాన్‌ ప్రజలపై పాక్ ఉక్కుపాదం

ఠాగూర్

సోమవారం, 9 జూన్ 2025 (09:18 IST)
ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్న బలూచిస్థాన్ ఉద్యమకారులు (బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ - బీఎల్ఏ)పై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపింది. బలూచిస్థాన్‌లో వేర్పాటువాద ఉద్యమాన్ని అణిచివేసేందుకు స్థానిక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా, బలూచిస్థాన్ అసెంబ్లీ ఆమోదించిన ఉగ్రవాద వ్యతిరేక (సవరణ) చట్టం 2025ను ఆమోదించింది. 
 
ఈ చట్టంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం మేరకు ఎలాంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ 90 రోజుల పాటు నిర్బంధానికి సైన్యానికి నిఘా సంస్థలకు అధికారం ఇచ్చారు. అలాగే ముందస్తు అనుమతులు లేకుండానే గృహాల్లో సోదాలు, అరెస్టులు చేసే అనుమతులు కూడా పాకిస్థాన్ సైన్యానికి ఇచ్చారు. ఆ కొత్త చట్టం రూపకల్పన పౌర హక్కుల ఉల్లంఘనేనంటూ అతర్జాతీయ సంస్థలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. 
 
బలోచిస్థాన్ అసెంబ్లీ ఆమోదించిన ఉగ్రవాద వ్యతిరేక (సవరణ) చట్టం 2025, స్థానికంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పౌరులు, మానవ హక్కుల సంఘాలు ఈ చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చట్టంలోని వివాదాస్పద అంశాలు బలూచ్ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఎటువంటి నేరారోపణలు లేదా కేసులు నమోదు కాకపోయినా, కేవలం అనుమానం ఆధారంగా వ్యక్తులను అదుపులోకి తీసుకునే అధికారం పాకిస్థాన్ సైన్యానికి, నిఘా సంస్థలకు దఖలుపడుతుంది. 
 
అరెస్టు చేసిన వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టకుండానే 90 రోజుల వరకు నిర్బంధంలో ఉంచవచ్చు. అంతేకాకుండా, కోర్టుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే సోదాలు నిర్వహించడానికి, వస్తువులు స్వాధీనం చేసుకోవడానికి, వ్యక్తులను నిర్బంధించడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేసేందుకు పోలీసు, నిఘా సంస్థల అధికారులతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందాలకు (జేఐటీ) ఈ చట్టం అధికారం కల్పిస్తోంది. కేవలం 'అనుమానం' ఆధారంగా అరెస్టులు చేసే వెసులుబాటు కల్పించడం పట్ల పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు