కరోనా వార్తలు రాసినందుకు వుహాన్ మహిళా జర్నలిస్టుకు జైలుశిక్ష!

మంగళవారం, 29 డిశెంబరు 2020 (15:23 IST)
చైనాలో వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ దెబ్బకు లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ పడుతూనేవున్నారు. అలాగే, కోట్లాది మంది ప్రజలు ఈ వైరస్ కోరల్లో చిక్క తిరిగి కోలుకున్నారు. అయితే, వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న ఈ వైరస్ గురించి స్థానిక మహిళా విలేఖరి ఒకరు వార్తల సేకరించి ప్రచురించసాగారు. దీన్ని నేరంగా పరిగణించిన చైనా కోర్టు ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వుహాన్ నగరంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఝాంగ్ జాన్‌ అనే మహిళా విలేఖరి ఎప్పటికపుడు రిపోర్టింగ్‌ చేస్తూ వచ్చారు. 
 
ముఖ్యంగా, కరోనా వ్యాప్తి గురించిన విషయాలను తెలుసుకోవడానికి, చనిపోయిన వారి సంఖ్యను తెలుసుకునేందుకు ఝాంగ్‌ గత ఫిబ్రవరిలో వుహాన్ నగరంలో చేరుకున్నారు. చాలా నెలలపాటు వుహాన్‌ నగరంలో నిండిపోయిన దవాఖానాల వాస్తవ పరిస్థితుల గురించి, ఉపాధి, వ్యాపారాలకు సంబంధించిన వారి కథలను వీడియోల రూపంలో తయారుచేశారు. 
 
ఝాంగ్ తన వీడియోలలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ.. విజిల్ బ్లోయర్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అరెస్టు, నేరారోపణలకు వ్యతిరేకంగా ఝాంగ్ తొలుత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. 
 
అయితే, ఆమె నిర్ణయాలను అధికారులు బలవంతంగా కట్టడిచేసి.. గొంతులోకి ద్రవాలను పోసి దీక్షలను భగ్నం చేశారని ఝాంగ్ న్యాయవాది చెప్పారు. అబద్ధాలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన ఆరోపణలపై ఝాంగ్‌ను బలవంతంగా షాంఘైకి పంపినట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారు.
 
ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆమెపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ఆమెతో పాటు మరో నలుగురు జర్నలిస్టులు అదృశ్యమయ్యారు. 
 
ఇద్దరు జర్నలిస్టులు చెన్ క్విషి, లి జెహువా తర్వాత విడుదలవగా.. మరో జర్నలిస్ట్ ఇప్పటికీ కనిపించడం లేదు. ప్రజల గొంతును అణచివేయడం తగదని కోర్టు విచారణ సమయంలో అరుస్తూ చెప్పడం కోర్టును మరింత ఆగ్రహానికి గురిచేసింది.
 
ఈ విచారణ కేవలం 3 గంటల పాటే కొనసాగిందని, విచారణకు ఝాంగ్‌ వీల్‌చైర్‌లో లాబీల్లో కనిపించిందని ఝాంగ్‌ తరపు న్యాయవాది వీ చాట్‌ యాప్‌లో వెల్లడించారు. ఝాంగ్‌ చాలా బరువు కోల్పోయిందని, ఆమె గతంలో కన్నా బలహీనంగా మారిందని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు