పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు : సైఫుల్లా కసూరి

ఠాగూర్

గురువారం, 29 మే 2025 (14:43 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడని ఉగ్రవాది సైఫుల్ కసూరి అన్నారు. పాకిస్థాన్ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఆయన.. పాక్ పాలకులు, సైనికాధికారులతో వేదికను పంచుకుంటూ భారత్‌పై విషం చిమ్మారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లాహోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారని తెలిపారు. 
 
పాకిస్థాన్ అణు పరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ లాహోర్‌లో భారీ ర్యాలీని నిర్వహించింది. ఈ సభలో సైఫుల్ కసూరి పాల్గొని 20 నిమిషాల పాటు ప్రసంగించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాది మదర్సిర్ అహ్మద్ పేరు మీద పంజాబ్ ప్రావిన్స్‌‍లోని అల్హా అబాద్‌‍లో పలు నిర్మాణాలు చేపడుతామన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారంతా భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. 
 
కాగా, ఈ కార్యక్రమంలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడిన సయీద్ కుమారుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తల్హా సయీద్ కూడా పాలుపంచుకున్నాడు. ఆయన చేసిన ప్రసంగంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. గతంలో లాహోర్‌లోని నేషనల్ అసెంబ్లీ 122వ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తల్హా సయీద్ ఇపుడు లష్కరే తోయిబా రాజకీయ విభాగమైన పీఎంఎంఎల్‌‍ నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు