ప్రాణాంతక కేన్సర్ చికిత్సలో ముందడుగు.. టీకాను ఆవిష్కరించిన రష్యా శాస్త్రవేత్తలు

ఠాగూర్

సోమవారం, 8 సెప్టెంబరు 2025 (10:58 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక కేన్సర్ మహమ్మారి చికిత్సలో ముందడుగు పడింది. రష్యా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కేన్సర్‌ను ఎదుర్కొనే ప్రక్రియలో భాగంగా టీకాను గుర్తించారు. రష్యాకు చెందిన ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ (ఎఫ్ఎంబీఏ) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
 
‘ఎంటరిక్స్' అని పేరు పెట్టిన ఈ వ్యాక్సిన్‌పై ఏళ్ల తరబడి పరిశోధనలు నిర్వహించినట్టు ఎఫ్ఎంబీఏ అధిపతి వెరోనికా వెల్లడించారు. మూడేళ్ల పాటు జరిపిన ప్రీ-క్లినికల్ ప్రయోగాల్లో ఈ టీకా అద్భుతమైన ఫలితాలను ఇచ్చినట్టు ఆమె వివరించారు. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమని, ఎంతో సమర్థవంతంగా పనిచేసిందని చెప్పారు. కొన్ని రకాల కేన్సర్లలో కణితుల పెరుగుదలను 60 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గించిందని, ప్రయోగాలకు గురైన జీవుల మనుగడ రేటు కూడా గణనీయంగా మెరుగుపడిందని ఆమె పేర్కొన్నారు.
 
కరోనా మహమ్మారి సమయంలో కొన్ని వ్యాక్సిన్లలో ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీనే ఈ కేన్సర్ టీకాలోనూ వినియోగించడం గమనార్హం. ఈ టెక్నాలజీ ద్వారా శరీరంలోని కణాలకు కేన్సర్ కణాలపై దాడి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే ప్రోటీన్లను తయారు చేసేలా శిక్షణ ఇస్తారు. 
 
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను తొలుత పెద్దప్రేగు కేన్సర్ చికిత్స కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనితో పాటు వేగంగా వ్యాపించే మెదడు కేన్సర్ (గ్లయోబ్లాస్టోమా), కంటి కేన్సర్ సహా కొన్ని రకాల చర్మ క్యాన్సర్లకు (మెలనోమా) కూడా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు