కరోనా వైరస్ దెబ్బకు రోజుకు 3 వేల మంది మృతి.. ఎక్కడ?

బుధవారం, 6 మే 2020 (12:39 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడని దేశాలు అతి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దాదాపు 250కి పైగా దేశాలు ఈ వైరస్ కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. అలాంటి దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక బాధిత దేశాల్లో అమెరికా ఇపుడు అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డోంట్ కేర్ అంటున్నారు. 
 
అయితే, వచ్చే జూన్ ఒకటో తేదీ తర్వాత రోజుకు మూడు వేల మంది చొప్పున కరోనా వైరస్ దెబ్బకు చనిపోతారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంచనావేసింది. న్యూయార్క్ టైమ్స్ నుంచి పొందిన సీడీసీ డాక్యుమెంట్ల లెక్కల ప్రకారం చనిపోయేవారి సంఖ్యను ట్రంప్ పాలనా యంత్రాంగం అంచనావేసింది. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలు, వారాంతాల్లో పార్కులకు వచ్చే వారి సంఖ్యను ఆధారంగా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 
 
ప్రధానంగా ఫ్లోరిడా, కొలరాడో, ఇండియానా, నెబ్రస్కా, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియాతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించారు. కుదేలైపోతున్న ఆర్థిక రంగానికి కొంతమేరకైనా ఉపశమనం కలిగించేందుకు ఈ సడలింపులు ఇవ్వడం జరిగింది. అయితే, ఈ సడలింపులు కారణంగా వైరస్ బారినపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు