ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. వెయ్యికి దాటిన పౌరుల మృతుల సంఖ్య

శుక్రవారం, 25 మార్చి 2022 (15:54 IST)
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆగట్లేదు. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు క్రిమియా సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోకి వెళ్లాయి. అప్పుడు మొదలైన దాడులు నేటికీ రేయింబవళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.
 
కొన్ని నగరాలు పూర్తిగా నిర్మానుష్యం అయిపోయాయి. 35 లక్షల మంది ఉక్రెయిన్‌ వీడి పొరుగు దేశాలు వలసపోయారు. అత్యధికంగా పోలాండ్‌లో 20 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ దాటి వెళ్లడానికి చూడా ఆస్కారం లేని పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఎక్కడికక్కడ రోడ్లు, బ్రిడ్జిల్ని పేల్చేశాయి రష్యా బలగాలు. జనావాసాలపైనా బాంబులు వర్షం కురిపిస్తోంది రష్యా. ఆరంభంలో రాజధాని కీవ్‌తో పాటు పెద్ద నగరాలు లక్ష్యంగా రష్యా దాడులు జరిగాయి. 
 
అయితే, ఉక్రెయిన్‌ దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో వ్యూహం మార్చింది రష్యా. మేరియుపోల్‌ వంటి నగరాలపై దాడులు చేస్తున్నాయి రష్యా బలగాలు. ఇప్పుడే మేరియుపోల్‌ నగరం 90 శాతం నాశనమైపోయింది. సుమారు లక్ష మంది సామాన్యులు అక్కడ చిక్కుపోయారు. వాళ్లక్కడి నుంచి బయటపడే మార్గం లేదు. వాళ్లకు ఆహారం, మంచినీరు, ఔషధాలు అందడం లేదు.
 
ఇకపోతే దేశంలోకి ప్రవేశించిన రష్యా సైనికుల్లో 15 వేల మంది మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే, నాటో అంచనాల ప్రకారం 7 వేలకు పైగా రష్యా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది.  
 
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ప్రకారం, ఉక్రెయిన్‌లో నెల రోజుల రష్యా దాడి కారణంగా మరణించిన పౌరుల సంఖ్య వెయ్యికి దాటింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా పెద్ద తప్పు చేశారని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు