ముంబైను చితక్కొట్టిన సన్‌రైజర్స్... ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన వార్నర్ సేన

బుధవారం, 4 నవంబరు 2020 (07:28 IST)
ఐపీఎల్ 13వ సీజన్ పోటీల్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టును హైదరాబాద్ ఓపెనర్లు చితక్కొట్టారు. తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓపెనర్లు జూలు విదిల్చారు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 149 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా విజయభేరీ మోగించింది. దీంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నిరాశ తప్పలేదు. 
 
షార్జా వేదికగా గత రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో డికాక్ (25), సూర్యకుమార్ యాదవ్ (36), ఇషాన్ కిషన్ (33), పొలార్డ్ (41) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా, హోల్డర్, నదీమ్ చెరో రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
 
ఆ తర్వాత 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు... 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అద్భుత విజయాన్ని అందుకుంది. వికెట్ల కోసం ముంబై బౌలర్లు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓపెనర్లు వార్నర్, వృద్ధిమాన్ సాహాలు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా యథేచ్ఛగా ఆడుతూ, బౌండరీలతో విరుచుకుపడ్డారు.
 
ఈ క్రమంలో 58 బంతులు ఆడిన డేవిడ్ వార్నర్ 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 85 పరుగులు చేయగా, 45 బంతులు ఎదుర్కొన్న సాహా 7 ఫోర్లు, సిక్సర్‌తో 58 పరుగులు చేశాడు. ఫలితంగా మరో 17 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
 
నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన షాబాజ్ నదీమ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ముంబైపై ఘన విజయం సాధించడంతో మెరుగైన రన్‌రేట్ కారణంగా బెంగళూరును కిందికి నెట్టి హైదరాబాద్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. కోల్‌కతాకు కూడా 14 పాయింట్లు ఉన్నప్పటికీ రన్‌రేట్ మైనస్‌లలో ఉన్న కారణంగా ఇంటి ముఖం పట్టింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు