ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ దగ్గరి బంధువు, సోదరుడైన అసిఫ్ ఖురేషీ (42) దారుణ హత్యకు గురయ్యాడు. కేవలం స్కూటర్ పార్కింగ్ విషయంలో చెలరేగిన చిన్న గొడవ ప్రాణం తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై హుమా ఖురేషీ తండ్రి, ఆసిఫ్ మేనమామ అయిన సలీమ్ ఖురేషీ మాట్లాడుతూ, "ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పెట్టారు. దారికి అడ్డంగా ఉందని పక్కకు తీయమని నా మేనల్లుడు అడిగాడు. దానికే పెద్ద గొడవ చేసి, ఇద్దరూ కలిసి వాడిని చంపేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుడు ఆసిఫ్ ఖురేషీ స్థానికంగా చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసింది. చిన్న కారణానికి ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.