ఆ ఘటనపై చలించిన "చిన్న ఎంజీఆర్" ... ఖననం కోసం భూదానం

శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (09:19 IST)
తమిళ చిత్రపరిశ్రమలోని సీనియర్ హీరోల్లో ఒకరు విజయకాంత్. ఈయనకు చిన్న ఎంజీఆర్ అనే పేరుకూడా ఉంది. అంటే.. అంతటి దయాగుణం ఆయన సొంతం. పైగా, కష్టంతో తన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఆదుకుంటారు. గతంలో ఇదే విధంగా మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు దివంగత ఎంజీ రామచంద్రన్ చేసేవారు. ఎంజీఆర్ తర్వాత అంతటి దయార్ధ్రగుణం విజయకాంత్ సొంతం. 
 
అయితే, ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ చేతుల్లో చిక్కి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ, వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబ సభ్యులే ముందుకురావడం లేదు. పైగా, ప్రస్తుతం ఉన్న శ్మశానవాటికల్లో ఖననం చేసేందుకు స్థానికులు అనుమతించడం లేదు. 
 
ఇటీవల, కరోనా బారినపడిన 57 యేళ్ళ వైద్యుడు సైమన్ హెర్క్యులస్ అనే వైద్యుడు చనిపోయారు. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు భౌతిక కాయాన్ని స్థానిక అన్నానగర్ శ్మశానానికి తీసుకెళ్లగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు అడ్డుతగిలారు. అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదని పట్టుబట్టారు. అక్కడ ఆయనను ఖననం చేస్తే కరోనా వైరస్ తమకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైద్యుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్‌పైనా దాడిచేశారు. దాంతో ఆ మృతదేహాన్ని మరోచోట రహస్యంగా ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ విషయం తెలిసిన విజయ్‌కాంత్ చలించిపోయారు. చెన్నైలోని తన స్థలంలో కొంత భాగాన్ని దానం చేశారు. కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు ఆ స్థలాన్ని వాడుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన తమ పార్టీ లెటర్ ప్యాడ్‌పై ఓ లేఖ రాశారు. ఈ చర్యతో ఆయన మరోమారు చిన్న ఎంజీఆర్ అనే పేరును సార్థకత చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు