పోటీ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేస్తే పదేళ్ల జైలు : లోక్‌సభలో కొత్త బిల్లు

ఠాగూర్

సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (15:16 IST)
పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసే వారిపై ఇకపై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ ప్రశ్నపత్రాలకు పాల్పడితే పదేళ్ల జైలుశిక్షను విధించనున్నారు. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టం కింద నేర నిరూపణ అయితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించనుంది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
 
ఈ బిల్లు వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపనుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులను కూడా శిక్షించనున్నారు. రాజస్థాన్‌, హర్యానా, గుజరాత్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. కంప్యూటరైజ్డ్‌ పరీక్షల ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చే దిశగా సిఫార్సుల నిమిత్తం ఉన్నతస్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఈ బిల్లులో ప్రతిపాదించారు. 
 
పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో పారదర్శకత, విశ్వసనీయతను తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. అలాగే నిజాయితీతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని, తమ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని యువతకు భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఈ బిల్లు లక్ష్యం విద్యార్థులు కాదని స్పష్టం చేసింది.
 
జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో ఈ బిల్లు గురించి ప్రస్తావించారు. పరీక్షల్లో అవకతవకల విషయంలో యువత ఆందోళన ప్రభుత్వానికి తెలుసని, ఈ సమస్యపై కఠినంగా వ్యవహరించేందుకు ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించిందని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు