పంజాబ్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఇంటిపై కొలువుదీరిన ఆర్టీసీ బస్సు

ఠాగూర్

బుధవారం, 6 మార్చి 2024 (09:16 IST)
పంజాబ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన రేషమ్ సింగ్ తన సర్వీసుకు గుర్తుగా తన ఇంటి పైకప్పుపై ఏకంగా ఓ బస్సును ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 2.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఇందులో ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుగానే స్టీరింగ్, సీట్లు, లైట్లు అన్నీ ఉన్నాయి. "నేను ఆర్టీసీ టెక్నికల్ విభాగంలో సుధీర్ఘకాలం సేవలందించా. ఇంటిపై బస్సును ఏర్పాటు చేయాలనేది నా కల. 2018 నుంచే ఈ పనిని ప్రారంభించా. మధ్యలో కరోనా కారణంగా ఆటంకం కలిగింది. కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేశా" అని కుంగ్‌ సాహెబ్ ప్రాంతానికి చెందిన రేషమ్ సింగ్ తెలిపారు. విధి నిర్వహణలో తనకు లభించిన జ్ఞాపికలను ఈ బస్సులో అందంగా అలంకరించినట్టు చెప్పారు. అలాగే, సర్వీసులో ఉండగా తనతో కలిసి పని చేసిన సహోద్యోగుల పేర్లను ప్రదర్శనంగా ఉంచారు. ఈ బస్సులో టీవీ కూడా ఉంది. ఎంతో ఇష్టపడి తాను నిర్మించుకున్న ఈ బస్సును తన వారసులు పరిరక్షిస్తారని రేషమ్ సింగ్ అశాభావం వ్యక్తం చేశారు. 
 
ఈ ఇంటిపై బస్సు ఫోటో, వార్త తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కంట పడింది. అంతే.. ఆయన ఈ వార్తను తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ట్వీట్ చేశారు. "ప్రజా రవాణా వ్యవస్థపై తనకున్న అభిమానాన్ని, ప్రేమను ఒక రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఇలా తెలియజేయడం అభినందనీయం. ఆర్టీసీ ఉద్యోగులకు తమ సంస్థ బస్సులపై మమకారం ఎక్కువ. విధి నిర్వహణలో వారు బస్సును సొంత మనిషిలా చూసుకుంటారు. రిటైర్డ్ అయ్యాక కూడా అదే ప్రేమను కనబరుస్తారు. తన జీవితంలో బస్సుతో విడదీయరాని అనుబంధం ఉందంటూ.. పంజాబ్‌కు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి రేషమ్ సింగ్ తన ఇంటిపై ఏకంగా బస్సునే నిర్మించాడు. విధి నిర్వహణలో తనకు లభించిన జ్ఞాపికలను బస్సులో అందంగా అలంకరించారు. బస్సుతో తనకున్న అనుబంధాన్ని ప్రపంచానికి చాటి చెపుతున్న రేషమ్ సింగ్‌కి సెల్యూట్" అంటూ సజ్జనార్ ట్వీట్ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు