లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు సిద్ధం.. కానీ : అరవింద్ కేజ్రీవాల్

ఠాగూర్

సోమవారం, 4 మార్చి 2024 (12:20 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హజరయ్యేందుకు సిద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే, ఈ నెల 12వ తేదీ తర్వాత తాను విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ మేరకు తాజా సమన్లకు ఆయన ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నట్టు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ కేసులో విచారణ నిమిత్తం మార్చి 4న రావాలని ఇటీవల కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసారీ గైర్హాజరైన సీఎం.. ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతానని అన్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
 
కాగా, ఢిల్లీ మద్యం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్‌ 2వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులు పంపిస్తున్నప్పటికీ హాజరు కావడం లేదు. సమన్లకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్దిరోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు