విచారణకు రావాల్సిందే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మరోమారు నోటీసులు

ఠాగూర్

ఆదివారం, 17 మార్చి 2024 (10:55 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోమారు షాకిచ్చారు. దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఢిల్లీ మద్యం స్కామ్‌లో విచారణకు రావాల్సిందేనంటూ మరోమారు అంటే తొమ్మిదోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 21వ తేదీన తమ కార్యాలయంలో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ కె.కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు తప్పకుండా రావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపించడం గమనార్హం. మరోవైపు, తమ నోటీసులకు కేజ్రీవాల్ స్పందించడం లేదంటూ ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించిన విషయం తెల్సిందే. 
 
దీంతో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. రూ.లక్ష ష్యూరిటీ, షరతులతో కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, ఈడీ అధికారులు మాత్రం ఆదివారం మరోమారు కేజ్రీవాల్‌కు నోటీసులు పంపించడం గమనార్హం. ముందస్తు బెయిల్ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై ఈడీ అధికారులు మరో కొత్త కేసు నమోదు చేసినట్టు ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం మీడియాకు వివరిస్తామని ఆప్ నేతలు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు