రూ.50 వేలు డబ్బు కోసం ఐదు రోజుల పెళ్లి .. ఎక్కడ?

ఠాగూర్

సోమవారం, 16 జూన్ 2025 (12:31 IST)
అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్న ఒక యువతిని పెళ్లికాని అమ్మాయిగా నమ్మించి దారుణంగా మోసగించిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులు కీలక పాత్ర పోషించి, బాధితుడి నుంచి సుమారు రూ.4 లక్షలు దండుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఈ మోసం కేసు విజయవాడ నగరంలో వెలుగు చూసింది. తాజాగా వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన 34 ఏళ్ల యువకుడికి చాలాకాలంగా వివాహం కుదరడంలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కూడా సంబంధాలు చూడమని కర్ణాటకలో ఉంటున్న శ్రీదేవి అనే మధ్యవర్తిని కోరారు. ఆమె ద్వారా విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తి వారికి పరిచయమైంది. 
 
తాయారు, తన బృందంలోని పార్వతి, విమల, ఆటో డ్రైవర్ అప్పారావులతో కలిసి కృష్ణలంకకు చెందిన పల్లవి అలియాస్ ఆమని అనే యువతిని పరిచయం చేశారు. గత నెల (మే) 13న విజయవాడలో పెళ్లిచూపుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో పెళ్లి నిశ్చయించారు. అయితే, అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తల్లిదండ్రుల వైద్య ఖర్చుల కోసమని నమ్మబలికి పెళ్లికి ముందే వరుడి కుటుంబం నుంచి రూ.3.5 లక్షలు వసూలు చేశారు.
 
ఈ నెల 5వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రిపై యువకుడితో పల్లవి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం, జూన్ 7వ తేదీన కర్ణాటకలోని గంగావతిలో నూతన దంపతులకు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ కూడా నిర్వహించారు. పల్లవి వెంట ఆమె సోదరుడిగా వచ్చిన హరీశ్ అనే వ్యక్తి రిసెప్షన్ ముగిసిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ వరుడి కుటుంబం నుంచి మరో రూ.50,000 తీసుకుని ఉడాయించాడు. ఆ తర్వాత ఐదు రోజులకు పెళ్లి కుమార్తె కూడా వెళ్లిపోయింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు