కరోనా భయంతో భార్యకు ముద్దుపెట్టలేక పోయానంటున్న కాశ్మీరీ నేత!

సోమవారం, 18 జనవరి 2021 (12:01 IST)
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు అందరికీ తెగనవ్వు తెప్పిస్తున్నాయి. జమ్మూలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ అత్యంత విచిత్రమైన పరిస్థితులను కల్పించిందన్నారు. చివరికి నిర్భయంగా తన భార్యకు ముద్దు కూడా ఇవ్వలేకపోయానని వాపోయారు.
 
దేశ రాజకీయాల్లో ఉన్న నేతల్లో ఫరూక్ అబ్దుల్లా ఒకరు. ఈయన నోటి వెంట ఈ మాట రాగానే అక్కడున్నవారంతా పెద్దపెట్టున నవ్వారు. కరోనా భయాల కారణంగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేకపోతున్నామని, కావలించుకోవాలంటే మరింత భయపడుతున్నామన్నారు. 
 
చివరికి తాను తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయానని, ఇక ఆలింగనం సంగతి అసలే లేదన్నారు. తన మనుసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేశానని అన్నారు. ఈ మాటలు విన్నవెంటనే అక్కడున్నవారంతా హాయిగా నవ్వుకున్నారు. 
 
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలతో కూడిన వీడియోను అక్కడున్నవారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా కోవిడ్-19 టీకా గురించి మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా... టీకాను అభివృద్ధి చేయడంలో భారత్ విజయవంతమైందన్నారు. పైగా, ఇతర ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు